27, అక్టోబర్ 2019, ఆదివారం

మారోజుల్లో దీపావళి

ఒకప్పుడు దీపావళి అంటే దసరా సెలవుల నుండీ మొదలయ్యేది హడావుడి.

బొగ్గుపొడి, సూరేకారం, గంధకం, ఐదు రెండు ఒకటి పాళ్లలో కొబ్బరి చిప్పలతో చేసిన తక్కెడతో కొలిచి, అంతా కలిపి మందు తయారు చేసేవాళ్లు.

పేక కట్టలో ముక్కల్ని కర్రకు చుట్టి, ట్వైన్ దారంతో లాగి తారాజువ్వల గొట్టాలు చేసి, దానికి జనపనారని, ఉడకబెట్టిన మైదాపిండితో అంటించి చుట్టి ఆరబెట్టి, అవి బాగా ఎండలో ఆరాకా.. ఆ మందు ఆ గొట్టాల్లో కూరేవాళ్ళు. ఎంతగట్టిగా అంటే పైన సుత్తిపెట్టి కొట్టి మరీ కూరితే అదొక రాయిముక్కలాగా ఉండేది. 

దానికి కొబ్బరీనుపుల్ల దారంతో కట్టి, చేతివేలు మీద జువ్వ పెట్టి బ్యాలన్స్ చేసి చూసి, ఒకపక్కకు వొంగిపోతే దాని పుల్ల కాస్త విరిచి బాలన్స్ చేస్తే, తారాజువ్వ రెడీ అయ్యేది.
అవి యాభైకాడికి కట్టకట్టి, కాగితంలో చుట్టి ఒకచోట దాచేవాళ్ళం.. 

ఆ రోజు పని పూర్తయ్యాక, ఒక పది పదిహేను టెస్టింగ్ కోసం జువ్వలు వెలిగించేవారు..

మొండి జువ్వ(పుల్ల కట్టకుండా) వదిలితే, జనాలందరిని ఒక నాలుగు నిముషాల పాటు జుంబా డ్యాన్సు ఆడించేసేది.. 
నెలబారున జువ్వలు వదిలి కాసేపు జువ్వలు పరుగుపందెం జరిగేది.. 

కొన్ని పైకంటా పోయి శభాష్ అనిపించుకుంటే.. కొన్ని పక్కనున్న తాటాకింటిమీద పడి భగ్గుమనేవి, మళ్ళీ నూతులో నీళ్లు తోడి గబగబా మంటలు ఆర్పే పని తగిలేది.

కొన్ని చేతుల్లో చీదేసి కాలిపోతే.. కొన్ని లుంగీల్లో దూరి తొడలు కాల్చేసేవి. కాలినోడిని ఓదార్చి, ఆకుపసరేసి కాసేపుకి మంట తగ్గి మంద అంతా ఇళ్లకుపోయేవారు. ఇది తారాజువ్వ గొడవ!

వెదురుపుల్లని పెన్సిల్ చెక్కినట్టు చెక్కి, కాగితం ముక్కల్ని చిన్నచిన్న స్క్వేర్ లాగా కత్తిరించి, ఆ పుల్లకు చుట్టి చిన్న మితాయిపొట్లంలా చుట్టేవారం, దానికి ఉడకబెట్టిన మైదాపిండిలో అలా వేలుముంచిరాసి లాగి పక్కనడేయటం. అది సీసింద్రి గొట్టం. సోవియట్ అట్టలని మంచి దళసరి కాగితంలో వచ్చేవి. వాటితో గొట్టాలు చేస్తే సిసింద్రీ మొత్తం వెలిగిపోయినా కాగితం కాలేది కాదు. అందుకని ఆ పేపర్లు సంవత్సరం పొడుగునా ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేసి దాచేసేవాళ్ళం.

మళ్ళీ ఆ గొట్టాలు ఎవడెక్కువ చేస్తాడు అని పోటీ. 
నేనైతే గంటకు వంద గొట్టాలు చేసినట్టు గుర్తు. 
అవి ఎండకు బాగా ఆరి,  కదిపితే గలగల శబ్దం వచ్చింది అంటే ఆరిపోయినట్టు, ఇంతకు ముందే జువ్వకు కలిపినట్టు కలుపుకున్న మందుని, కాకపోతే ఈసారి ఐదు రెండు అర పాళ్లు కలిపేవాళ్ళం.

చిన్న పుల్ల పెట్టి ఆ మందు ఒకొక్క గొట్టంలోకి కూరటం. మందు మొత్తం కూరాకా అదే పుల్లతో మూతలాగా నొక్కేసి పక్కనడేయటం.
కాళ్ళునెప్పి పుట్టినా లెక్కచేయకుండా, సరదాగా రాత్రంతా కూర్చుని సిసింద్రీలు కూరిన రోజులున్నాయి. 

అన్నెందుకురా అని పెద్దోళ్లు తిట్టినా లెక్కచేయకుండా, వేలల్లో సిసింద్రీలు కూరేవాళ్ళం. 

ఇక సాయంత్రం అయ్యాకా ఆ సిసింద్రీల యుద్ధం జరిగేది. ఒరే వెధవల్లారా, తాటాకిళ్ళ దగ్గరే ఏడుస్తారే, అని ఒకొక్క ఇంట్లో తిట్లు తింటూ, అలా ఊరి బయటకు పోయి.. రెండు గ్రూపులుగా చేరి వెలిగించి అవతల గ్రూపుపైపడేస్తే, అది సర్ర్ మని ఏటో దూరేసేది. మళ్ళీ వాళ్ళు వేసింది సర్ర్మంటూ ఇటువైపు దూరేది. అలా వేసుకుంటూ రాత్రంతా సంబరాలు జరిగేవి. ఇది సిసింద్రీ గొడవ..!

మంచి తాడిచెట్టు ఎక్కి ఒక పదిపదిహేను వాటమైన ఆకులు కొట్టి, ఒక రోజు ఎండలో ఎండబెట్టేవారం.. అకుల్లో ఉన్న పచ్చంతా పోయి, ఆకు కాస్త పసుపు రంగులోకి వచ్చాకా కత్తిరించి, ఈనులు తీసి వరసగా పేర్చేవాళ్ళం.

ఆకు మధ్యలో చిన్న పొట్లం చేసి అందులో చిన్న చెంచాడు పటాస్ పోసి, ముందుగా కత్తిరించుకున్న ఎలక్ట్రిక్ ఒత్తుల్లోంచి ఒక ఒత్తి తీసి అందులో పెట్టు పొట్లం కట్టినట్టు ఆకు అలా దోపి నాలుగైదుసార్లు చుట్టేస్తే టపాకాయ రెడీ అయ్యేది. దాన్ని మేం పెటేబుగాయ అని ముద్దుపేరు పెట్టుకున్నాం. తాటాకుతో చేసాం కాబట్టి తాటాకు పెటేబుగాయ.

ఒక్కటి వెలిగించి వేస్తే, ఊరంతా రీసౌండే.. అంత సౌండ్ వచ్చేది. ఎలక్ట్రిక్ ఒత్తి అంటే జమ్మని అంటుకునేది. చాలావరకూ చేతిలోనే పేలిపోవటం, లేదా విసిరింది కిందపడకుండా గాల్లోనే పేలేది.

అలాగే మతాబు మందు తెచ్చి, మతాబులు.
అదే మందు కుమ్మరి ఇటుకల బట్టి దగ్గర కొన్న మట్టి చిచ్చుబుడ్డిలలో కూరి రాత్రి అయ్యేక వెలిగిస్తే ఒకొక్కటి పదిహేను నిముషాలపాటు కాలేది.

ఇప్పుడు ఈ హడావుడి లేదు. అసలు దీపావళి రోజునే హడావుడి కనబడటంలేదు. ఈరోజుల్లో పిల్లలకు ఇవన్నీ తెలిసే చాన్సు కూడా లేదు అంటే చాలా బాధగా ఉంది.

రైతుకు టపాసులు కొనే స్తోమత లేక.. పొలంలో వానకు పడిపోయిన పంటను చూసుకుంటూ కూర్చున్నాడు.
చేతిలో నాలుగు డబ్బులున్నోడు కొట్లో అమ్మే నాలుగు టపాసులు అంటించి ఏదో కానిచ్చేస్తున్నాడు.

ఇలా ఏ హడావుడి లేని.. గ్రీన్ దీపావళి జరుపుకుంటున్నారు పల్లెల్లో..

23, అక్టోబర్ 2019, బుధవారం

స్థలం

సన్నాయిమేళాల మోత మోగింది. పనోళ్లు ఆవుని తీసుకొచ్చి మెట్లు ఎక్కించారు. హాలులో గదుల్లో అన్నింటిలోనూ ఆవుని తిప్పారు. ప్రతీ గడప దగ్గరా గుమ్మడికాయ పగిలింది. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు రెపరెపలాడాయి. వేద పండితులు హోమాలు చేశారు.. ఏక కంఠంతో మంత్రాలు చదివారు. వెయ్యికి పైగా విస్తర్లు లేచాయి. అందరికీ దక్షిణ తాంబూలాలు అందాయి, సంభావనలు భారీగా ముట్టాయి. వచ్చిన అతిధులందరూ సంతోషంగా వెనుదిరిగారు. వైభవంగా గృహప్రవేశం ముగిసింది.

ఆ ఊరికి కొత్తగా బదిలీ మీద వచ్చారు ఇంజనీరుగారు. ఆయనకు సుమారు ముప్పైయేళ్ళ వయసు.
ఆయన దర్జాగా కోటువేసుకుని ఆమె భార్య చేయిపట్టుకుని జీపులోంచి దిగారు. ఆయనతోపాటుగా తమ్ముడూ, చెల్లెలూ, వాళ్ళ అమ్మగారు దిగారు. ఆమెకు సుమారు యాభైయేళ్ళ వయసున్నా సన్నగా చలాకీగా ఉందామె. అందరూ చాలా సంబరంగా కొత్త ఇంట్లోకి పరుగులు పెట్టారు.

ఏడేళ్ళుగా మొండిగోడలూ ముళ్ళమొక్కలతో నిండిపోయుండేది ఆ స్థలం. ఇప్పుడు  అక్కడ రెండస్థుల ఇంద్రభవనం కట్టారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనంత అందమయిన ఇల్లు. ఆ ప్రదేశానికి వన్నె తెచ్చేలా రాత్రి విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోయింది. ఆ స్థలానికి ఇప్పుడు వైభవం వచ్చింది.

వసారాలో పొయ్యివెలిగింది, పెరట్లో తులసిమొక్క చిగురులువేసింది. ఇల్లంతా ఎప్పుడూ పండుగ వాతావరణంలా కలకళలాడింది. 
ఇంజనీరుగారి చెల్లెలు ఆ ఊరి కాలేజీలో చేరింది. తమ్ముడు డాక్టర్ గా ఆ ఊర్లోనే హాస్పిటల్ ప్రారంభించాడు. అమ్మగారు పూజలనీ పునస్కారాలనీ వీధిలో అందర్నీ పిలిచి ప్రతిరోజూ పండుగలా జరిపించేది. ఆ వీధికి ఇంజనీరుగారివీధి అని పేరు రావటానికి ఎంతో సమయం పట్టలేదు. 

వసారాలో పొయ్యికి అలుపన్నది లేకుండాపోయింది. రోజుకు ఒక ఇరవై మందికి తక్కువకాకుండా విస్తర్లు లేస్తున్నాయి. తులసిమొక్క వృక్షంలా అల్లుకుపోయి, చుట్టూ పెద్ద పెరటి తోటను సాయం తీసుకొచ్చుకుంది. చిక్కుడు, బెండ, ఆనప, గుమ్మడి, ఇలా ఇంట్లోకి కావాల్సిన కూరలన్నీ అక్కడే పండేవి. పెద్దావిడ పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంజనీరుగారు బయటవూరి పనుల్లో ఎక్కువ మునిగిపోయారు. నెలకొకసారి ఇంటిపట్టున కనిపించేవారు. మిగతారోజుల్లో దేశాలుపట్టుకుని తిరిగేవారు. అలా కాలం గడిచిపోతుంది.

ఒకరోజు ఇంజనీరుగారి చెల్లెలు కాలేజీలో ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుని చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. అన్ని ఊర్లు తిరిగి వెతికించారుగానీ, ఆమె జాడ తెలియరాలేదు. కూతురు మీద బెంగపెట్టుకుని మనోవ్యధతో పెద్దావిడ గదిలోంచి బయటకు రావటం మానేశారు. 

కోడలు కొన్నిరోజులు ఇంటిపనులు చక్కబెట్టింది. ఒకరోజు ఇంజనీరుగారి తమ్ముడు శవంగా మారి రైలుపట్టాల మీద పడున్నాడు. ఎలా జరిగిందో ఏం జరిగిందో ఎవరికీ తెలియరాలేదు. 

కొడుకుపోయిన వార్తవిన్న పెద్దావిడకు పిచ్చిపట్టింది. డాక్టర్లకు చూపించినా లాభంలేకపోయింది. ఆమె గదిలోనుండే కేకలుపెట్టేది. పనివాళ్ళుకూడా ఆ దొడ్లోకి వెళ్ళటానికి భయపడేవారు. కోడలు పుట్టింటికి వెళ్లి మళ్ళీ తిరిగిరాలేదు. 

ఆ ఇంట్లో పూజలు ఆగిపోయాయి. తులసిమొక్కకి నీళ్లు పొసేవాళ్ళే లేక కొండెక్కిపోయి బూజుపట్టింది.  ఇంద్రభవనం కాస్తా పాడుబడిపోయింది. కొన్నాళ్ళకు వాళ్లేటెళ్ళిపోయారో ఎవరికీ తెలీలేదు.

ఆ స్థలానికి మళ్ళీ వెనకటి గతే పట్టింది. ఇంటిచుట్టూ ముళ్లమొక్కలు పుట్టుకొచ్చాయి. బిక్కుబిక్కుమంటూ నాచుపట్టిన గొడలతో భవనం వెలవెలబోయింది.

కొన్నాళ్ళకు ఎవరో ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. ఇల్లు బద్దలుగొట్టే బాధ్యత ఒక కాంట్రాక్టరుకిచ్చారు. రెండురోజుల్లో ఆ ఇళ్లుకూలగొట్టి, ముళ్ళమొక్కలు పెకళించి, ఒక ఖాళీ స్థలంలా చదనుచేసిచ్చాడు కాంట్రాక్టర్. అక్కడ మరొక పెద్ద ఇల్లు వెలిసింది. ఒక నడివయసు జంట అక్కడ కాపురమెట్టారు. పెరటివైపు పెద్ద తులసిమొక్కనాటి పూజలు మొదలుపెట్టారు. కాలంగడచినా అది ఇప్పటికీ ఇంజనీరుగారి ఇల్లుగానే అందరికీ పరిచయం.

అతనొక బట్టలు వ్యాపారి. ఊరిలో చిన్న దుకాణం ఒకటి మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నా వాళ్ళకి పిల్లలు కలుగలేదు, పూజలు చేశారు, దానాలు చేశారు. సంతానంకోసం చాలా తాపత్రయపడ్డారు, కానీ సంపద రెట్టింపవుతూనే వస్తుంది. ఒక్క దుకాణంతో మొదలుపెట్టి అంచెలంచెలుగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టాడు. ఊర్లో ఒక నాలుగు దుకాణాలకు యజమాని అయ్యాడు.

కొంతకాలం గడిచింది. అకస్మాత్తుగా ఆ వ్యాపారిని ఏక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది. ఇల్లు బోసిపోయింది. నెమ్మదిగా పాడుబడిపోయింది. 
మళ్ళీ వెనకటి స్థితికి చేరుకుంది. ముళ్ల మొక్కలు పుట్టుకొచ్చాయి.

రెండేళ్లు ఆ ఇల్లు అలాగే ఉంది. ఒకరోజు ఒక స్కూలు టీచరు ఆ స్థలాన్ని కొనుకున్నాడు. ముళ్ళమొక్కలు కొట్టించి అంతా శుభ్రం చేయించాడు. అదే ఇంటికి రంగులు వేయించాడు. తనకు అనువుగా ఇంటిలో మార్పులు చేయించాడు.

కాలం గడుస్తున్న కొద్దీ అతని కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. తన మూడేళ్ళ కూతురికి అంతుచిక్కని ఆరోగ్య సమస్యతో తల్లడిల్లిపోయాడు. ఆ స్థలానికి ఉన్న పూర్వ చరిత్ర తెలుసుకుని, ఏదో వాస్తు దోషమే ఈ సమస్యలకు కారణం అని తెలుసుకున్నాడు. ఎందరో వాస్తుపండితుల్ని కలిసాడు. సలహాలు తీసుకున్నాడు. వాస్తుశాంతి పూజలు చేయించాడు. ఒక పండితుడు నైరుతి లోపలికి పొడిచింది అందుకే ఈ దోషాలు అని గోడలు బద్దలుకొట్టించి కొత్తగా కట్టించాడు. వేరొక పండితుడు ఈశాన్యంలో ఎత్తు ఎక్కువ ఉంది అని పెద్దగొయ్యి తవ్వించాడు. 

ఇంటిలోనూ స్థలంలోనూ చాలా మార్పులు జరిగాయి. అప్పులు చేసి మరీ పండితులు చెప్పింది చేయించాడు.
కుటుంబ ఆరోగ్యంలో అతనికి ఏమీ మెరుగనిపించలేదు. ఒకరోజు తెల్లవారుజామున లేచి నిద్రమత్తులో ఇంటి బయటకొచ్చాడు. పెరట్లో ఉన్న తులసిమొక్కకి ముళ్ళు రావటం చూసి ఆశ్చర్యపోయాడు. కాసేపు అతనికి ఏమీ అర్ధం కాలేదు.  మతిలేనివాడిలా ఆ స్థలమంతా కలియతిరిగాడు. ఈశాన్యంలో ఉన్న గోతిలో కాలుజారి పడి, తలకు పెద్ద దెబ్బతగిలి ప్రాణం విడిచాడు.

కాలం గడిచింది.. మళ్ళీ ఇల్లు పూర్వ స్థితికి వచ్చింది. 
ఎందరినో పొట్టనపెట్టుకున్న ఆ స్థలం ఆనందంతో ఉప్పొంగినట్టుగా ముళ్లపొదలు పుట్టుకొచ్చాయి. గోడలు నాచుపట్టాయి. 

ఒకరోజు తుప్పుపట్టిన గేటు తీసిన చప్పుడయ్యింది. 
ఇంకా ఎంతమందిని మింగుతుందో తెలియదు. ఆ స్థలం ఆశగా ఎదురుచూస్తుంది, తరువాత ఎవరొస్తున్నారా అన్నట్టు ఎదురుచూస్తుంది. 

Related Posts Plugin for WordPress, Blogger...