5, జనవరి 2011, బుధవారం

జెక్కంశెట్టి సూర్రావు - ఎకరం పొలం...

మిట్టమద్యాన్నం... ఎండు కొబ్బరాకులు మంటేసినట్టు ఎండ భగభగలాడిపోతుంది. రోహిణీ కార్తి కావటంవల్లేమో.. ఏడి గాలి ఈస్తావుంది.., ఆ గాలికి.. కాలిన పెనం మీద నీళ్ళు జిమ్మితే బుస్సుమన్నట్టు ఒంటిమీద చెమటకూడా  బుస్ మని ఆవిరైపోతుంది. మినువులూ పెసలూ కలిపిజల్లిన ఎకరంచెక్కలో.. చిన్న చిన్న మొలకలు లేచినియ్యి.., బోదికి అడ్డంగట్టి.. చేలోకి నీళ్ళెక్కించి.. యూరియా జల్లుతున్నాడు జక్కంశెట్టి సూర్రావు..

"ఏదోటిపడతాం.. ఏరెట్టెయ్యండీ.., ఆడితో నేను పల్లేను..", అన్న చిన్నకొడుకు ఈరాసామి మాటలే.. ఇంకా చెవుల్లో గింగిరీలు కొడతా తిరుగుతున్నాయి..., "ఇన్నాళ్ళు కలిసున్నాంగదరా.., నేను పోయేకా ఏరడండి.. అప్పటిదాకా ఈ మాటెత్తితే నా మీదొట్టే", అని ఒట్టెట్టుకుని సర్దిచెప్పి ఇద్దరి కొడుకులనోళ్ళూ మూయించేసాడు సూర్రావు. ఏదో పెద్దోడని మాటిని ఎళ్ళిపోయేరుగానీ.. ఇద్దరూ కలిసుంటారని నమ్మకం సూర్రావుకి కలగటంలేదు .

సూర్రావుకి ఇద్దరు కొడుకులు... పిల్లలు చేతికందే టైముకే ఇంటావిడ ఫుటో గోడెక్కేసింది. సూర్రావు చిన్నప్పట్నుండీ ఉల్లిపాయలు, కూరగాయలూ పక్కూళ్ళల్లో రైతుల్దగ్గర టోకు ధరక్కొనేసి.. ఊరిసంతలో అమ్మి ఏపారం చేత్తుండేవోడు. అలాగే సంపాయించి, ఓ ఎకరం పొలంగొన్నాడు. ఇద్దరుకొడుకులకూ పెళ్ళిళ్ళుచేసి.. ఓ రెండువాటాల ఇల్లుకట్టిచ్చేడు.
ఇంటరుగుమీదే మంచమేసుకుని పడుకుంటా.. ఓపికున్నప్పుడు పొలంపనులూ.. ఏపారం చేత్తా కాలగడిపేత్తుంటాడు సూర్రావు.

కొడుకులిద్దరికీ అదే ఏపారం నేర్పించేడు.. అతనికున్న పలుకుబడి.. నమ్మకంమూలానా ఆళ్ళిద్దరి బిజినెస్సూ బాగానే సాగింది.. ఇద్దరూ బాగా సంపాయించడం మొదలెట్టేరు. లచ్చిందేవి తాడవమాడింది.. పట్టిందంతా బంగారమయ్యింది. ఆ ఇంటి గడప బంగారంరంగులో మెరిసిపోయింది.

డబ్బుచేతులో ఆడ్డంతో... ఇదినాదీ.. ఇదినీదీ.. అని ఇద్దరిమద్దెనా తేడాలొచ్చేయటం మొదలెట్టేయి. అప్పుడుదాకా ఉమ్మడికుటంబంగానే కలిసున్నోళ్ళ మద్దెన చిన్న చిన్న గొడవలు మొదలయ్యేయి. ఓరోజు  పొద్దున్న, కొడుకులిద్దరికీ మాటతేడాలొచ్చి.. ఇంట్లో మెడామెడాఏసుకున్నారు. ఎలాగోలా సర్దిచెప్పిన  సూర్రావు, ఆ గొడవగురించే ఆలోచిత్తా ఏదీకానేల పొలానికొచ్చి ఎండకొండా తెలీకుండా చేనుకు మందేయటం మొదలెట్టేడు

రిసౌండుతో బుర్రలో తిరుగుతున్నమాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి... కళ్ళుభైర్లుగమ్మేత్తున్నాయి.. సుట్టూ సిమ్మసీకటైపోయింది.. సేతులూ కాళ్ళు పట్టొదిలేత్తున్నాయి.. సేత్తోఅట్టుకున్న యూరియాబుట్ట జారికిందడిపోయింది...,  ఎండదెబ్బతగిలేసి.. చెట్టుమీదనుండి రాలిపోయిన పిట్టలాగా, గట్టుమీదనుండి పంటబోదిలో దబ్బుమని కూలబడిపోయేడు సూర్రావు. అరిటిబొంత కాల్లోకి గిట్టేసినట్టుగా ధుభ్మని ఇనిపించిన సౌండుకు.. పక్కచేళ్ళో రాలిపోయిన వరిగింజల్ని పొడుచుకు తింటా సరసాలాడుకుంటున్న చిలకలూ.. గోరింకలూ.. పంటపిచ్చుకలూ బెదిరిపోయి పైకెగిరిపోయేయి.

పంగిడి రావుడి గారి పల్లంచేనులో.. కొబ్బరిసెట్లనీడన కూర్చుని పచ్చగడ్డికోత్తున్న మద్దాలి ఈర్రాజుకు ఇనపడిందా దబ్బుమన్న సౌండు. గడ్డికోయటం ఆపేసి లేచినిలబడి సూసేడు... ర్రాజు., ఏమీ కనబల్లేదు.. అప్పుడుదాకా మందేత్తాకనిపించిన సూర్రావు కనబడకపోయేసరికి అనుమామొచ్చింది. సూర్రావుపొలంకాడికి రొండడుగులేసేడు ఈర్రాజు. పంటబోదెలో పడున్న సూర్రావుని పైకిలేపి.. పెద్దపొలికేకేసి.. వూరి జనాందరినీ పోగేసేసేడు.

సూర్రావును పక్కూరి పెద్దాస్పటల్లో జాయినుచేసేరు. పరీచ్చలన్నీ సేసిన డాక్టరుగారు..  మనిషికేం పెమాదంలేదుగానీ పచ్చవాతంమొచ్చి ఒక సెయ్యికాలు లాగేసినియ్యి.. లేచేదాకా మాటుంటాదోలేదో తెలీదు అని సెప్పటంతో బెంబేలుపడిపోయేరు కొడుకులిద్దరూ.

వారంరోజులు ఆసుపత్రిలోవుంచి సూసినా కాలుచేయ్యిరాలేదు. ఇహలాభంలేదని ఇంటికితీసుకొచ్చేసేరు సూర్రావుని. ఇంటరుగుమీద ఓ నులకమంచమేసి దానిమీదపడేసేరు.  జనాల్నిగుర్తుపట్టి అటూ ఇటూ చూడగలుగుతున్నాడు సూర్రావు.. ఏదో చెప్పాలనుకుంటున్నాడుగానీ గొంతుదాకా వచ్చిన మాటలు అక్కడే ఏదో అడ్డబడిపోయినట్టు ఆగిపోతున్నాయి. అన్నం జావలాగాచేసి నోట్లోపోత్తున్నారు... ఒకటీ..రోండూ..అన్నీమంచంమీదే..  చిన్నపిల్లోడికన్నా ఎక్కువసేవలజేయాల్సొత్తుంది.

నాలుగురోజులు బాగానే సేవలుచేసిన కోడల్లిద్దరూ, తరువాత మొహాలుపక్కెట్టేసేరు.
"సత్తే సచ్చేడు...ఈ దరిద్రాన్ని ఎన్నాళ్ళునెత్తీమీదెట్టుకంటామమ్మా..", అని ఇంట్లోంచి బయటికిరావటమే మానేసేరు..,ఆళ్ళపిల్లల్నిగూడా ఈదిగుమ్మంఏపు రానీకుండా కట్టడిచేసేసేరు.
కొడుకులిద్దరూ.. ఆడుసూత్తాడని ఈడు..ఈడుసూత్తాడని ఆడు, దొడ్డిగుమ్మంలోంచే తండ్రిఏపు కన్నెత్తిసూడకుండా మసులుతున్నారు.

ఇదంతా చూత్తా.. ఎదురింట్లోవున్నకమలకి పేనం నీరయిపోయింది.. ఆడపిల్లలేకపోటంతో కమలని చానా పేనంగా.. కన్నకూతుర్లా చూసుకునేటోడు సూర్రావు. ఏదన్నా పండగొత్తే పక్కూరెల్లి కొడళ్ళకి తెలీకండా చీర కొనిచ్చేవోడు.., అదిచూసి అంతా అనేవోరు.. "ఏరా సూర్రావా..అంతంత ఖరిదేట్టి దీనికే చీరకొంటన్నావో..మీ కోడళ్ళకు కొనియ్యరాదేంటిరా", అని.. "చాల్లేండే.. ఆళ్ళకు నాకొడుకులే కొనిత్తారు.. కమలకెవరిత్తారే.., మా అల్లుడా.. పొట్టకోసం అని బెల్లవొంటవొండుతా ఊళ్ళెంబడి తిరుగుతాడు.. ఆర్నెళ్ళకోసారొత్తాడు.. పాపం దీనికి మాత్రం సరదాలుండవేంటే.. నాకూతుర్లాంటిదే ఇదా..", అని నవ్వుతా కమల తలనిమిరేవోడు సూర్రావు.

అలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టమొచ్చేసిందేంటి దేవుడా అని కన్నీలెట్టేసుకుంది కమల. "ఇలాటి కష్టం పగోడిక్కూడా రాకుడదమ్మా", అని ఆ వూరి కొండాలమ్మకి దణ్ణమెట్టుకుంది. మొహాలు పక్కెట్టేసి.. కొడుకులూ కోడళ్ళు వదిలేసిన సూర్రావుని.. తనకున్నదాంట్లోనే వండిపెడతా.. కంటికిరెప్పలాగా సూసుకుంటా సేవలుచేత్తంది కమల.

ఆరోజు సోమవారం, ఏకాదశి, పొద్దున్న ఐదుగంటలకి.. రామకధనువినరయ్యా.. అంటా.. రాములోరి గుడిమీద లవకుశ పాటలొత్తున్నాయి.., సూర్రావు మంచమట్టి సరిగ్గా ఆరోజుకు నెల్ల్రోజులయ్యింది.., కమల సూర్రావుని పేనంగా చూసుకుంటానేవుంది.. సేవలుచేత్తానేవుంది..
ఆ సెనంతో కమలరుణం తీరిపోయింది కాబోలు.. అలా రామకధ ఇంటానే.. సూర్రావు పేనం గాల్లోకలిసిపోయింది.

ఒక్కసారిగా ఆ ఈది ఈదంతా గొల్లుమంది. గుండెలు బాదుకుంటా పైకి ఏడుత్తున్నట్టు నటిత్తానే దహన కార్ర్యక్రమాలు చేసేసేరు కొడుకులిద్దరూ. దినంరోజు ఊరందరికీ ఆకులేసేసేరు. ముసలోడి దరిద్రమొదిలిందిరా నాయనా అని మనసులో అనుకుంటానే  మా గొప్పగా కార్యక్రమం జరిపించేసేరు.

ఎంగిలిచేతులు కడుక్కుని.. జనాల్నలా ఎళ్ళేదాకా ఆగి, బూతులపురాణం మొదలెట్టేడు పెద్దకొడుకు రంగారావు. "ఎంటనే ఈ ఇల్లుకాలీ చేసేయ్యి! ఇది నా ఇల్లెహే.." అంటా ఈరాసామింట్లో సామానంతా బయటడేటం మొదలెట్టేడు.., కోపంతో వూగిపోతున్న ఈరాసామెళ్ళి రంగారావుని మెడేసేసుకున్నాడు.  పొలం..ఇళ్ళూ  మొత్తం ఆస్తంతా తనపేరే రాసున్నట్టుగా వున్న దత్తావేదులు చూపించి..అంతా నాదేనన్నాడు రంగారావు. అప్పుడుదాకా వూగిపోయి.. తాండవంచేసేసిన ఈరాసామికి దత్తావేదులు చూసేసరికి నోటమాటపడిపోయింది.

ఆస్తినాదంటే నాదని.. ఇద్దరూ వూరిపెద్దలమద్దెన పంచాయితీ పెట్టేరు. రంగారావు చూపిత్తావున్న సాక్ష్యానికి.. పెసిడెంటుగారే కాదు.. పెద్దలెవ్వరూ ఏమీ మాటాడలేకపోయేరు. ఇక కోర్టుకెళ్లటమే దిక్కని అంతా తేల్చిసెప్పేసేరు.

పక్కూరు శంకరంమాస్టారుగారి తమ్ముడు కొడుకు మహ పేరున్న లాయరు. అతన్నట్టుకుని జరిగిందంతా చెప్పి.. కోర్టులో కేసేయించేడు ఈరాసామి.
రంగారావు తక్కువోడేంకాదు, ఆడిని తలతన్నే.. బాబులాంటి లాయర్నట్టుకుని ఈరాసామికి దెబ్బకొట్టేడు..

కోర్టు బయటీళ్ళు.. కోర్టులోపల ఆళ్ళలాయర్లు కొట్టుకుంటా.. కేసులు వాయిదాపడతున్నాయి.. కాలం గడుత్తుంది. ఏరు కాపురం పెట్టేసి.. రెండువాటలమద్దెనా కొబ్బరాకు దడికట్టేసుకుని.. ఒకరిమొహాలొకరికి కనబడకుండా.. ఏపారాలు చేసుకుంటా, నెలకోసారి.. కోర్టుమెట్లేక్కొత్తున్నారు అన్నదమ్ములిద్దరూ.

రోజులు గడుత్తున్నకొద్దీ కేసు సాగుతానేవుందిగానీ.. తేలటంలేదు. బజార్లో అందరి నోట్లో ఈళ్ళగొడవలే నాస్తా అందరికీ లోకువైపోయేరు అన్నదమ్ములిద్దరూ. జెక్కశెట్టి సూర్రావు కొడుకులుగా ఇన్నాళ్ళు నమ్మకంగానడిచిని ఏపారం నత్తనడకనడవటం మొదలెట్టింది. ఈళ్ళతో ఏపారం కలిసి చేసేటోళ్ళంతా ఆడిమాటలీడికి ఈడిమాటలాడికి మోసేసి... ఇద్దర్నీఇంకా రెచ్చగొట్టేసేరు. ఇద్దరిదగ్గర్నుండీ లొసుగులులాగి.. దొరకినకాడికి నొక్కేత్తా.. పలుకుబడిపెంచేసుకున్నారు.

పిల్లలా పెళ్ళిళ్ళకెదుగుతున్నారు. చదువులనీ అయ్యనీ ఇయ్యనీ కర్చులకోసం, అప్పులుచేయటంమొదలెట్టేరు.. కొంతకాలానికి బాగా అప్పులపాలయిపోయేరు. ఇల్లువాకిలీ అమ్ముదామంటే.. అయింకా కోర్టుకేసుల్లో నలుగుతానేవున్నాయి.

ఓ రోజు సంతనుండి ఇంటికొత్తున్న ఈరాసామికిఆళ్ళ లాయరు పొంగిపోతా ఎదురొచ్చేడు.
"కేసుమనమే గెలిచేం.. వీరాస్వామీ.., ఆస్తి సగం సగం పంచుకోవాలనీ కోర్టుతీర్పిచ్చింది", అని సంతోషపడిపోతా చెప్పేడు. అదిన్న ఈరాసామికి పేనం లేచొచ్చినట్టయ్యింది.., అప్పులన్నీతీర్చేసి గట్టెక్కొచ్చనుకున్నాడు.

ఎవరివాటా ఆళ్ళు పంచేసుకుందామని అనుకుంటుండగా.. ఇన్నాళ్ళు మేం మీకోసం వాదించినందుకు ఇంతయ్యిందని లెక్కరాసిచ్చేరు ఇద్దరి లాయర్లు..
ఆ లాయరు ఫీజులకి వచ్చినట్టేవచ్చిన ఎకరంపొలం పోయి.. ఇల్లుమాత్రం మిగిలింది.

ఇన్నాళ్ళు గొడవలత్తో ఏంపోగొట్టుకున్నారో తెలుసుకుని ఒకర్నట్టుకొకరు ఏడిచేరు ఇద్దరన్నదమ్ములూ.
కొబ్బరాకు దడులు పడగొట్టేసి.. ఆ రోజునుండే మళ్ళీ ఉమ్ముడికాపురం పెట్టేసేరు. కలిసిమెలిసుంటా కలిసి ఏపారాలు చేత్తా..ఆ ఇంటికి పూర్వవైభవం పట్టుకొచ్చేరు.

ఇంటి గడప పచ్చరంగులో బంగారంలాగా మెరిసిపోయింది. మళ్ళీ లచ్చిందేవితో తాడవమాడేసిందా ఇంటిలో.

సేతుల్లో డబ్బులాడేసినియ్యి.., ఇది మాదీ.. ఇది మీదీ.. అని ఆళ్ళపిల్లలమద్దెన తేడాలు రావటం మొదలయ్యేయి.
ఆ తేడాలు పెద్దగొడవలయ్యేయి. "ఇదంతా మనదిరా.. మీది మాదీ ఏంటి..", అని.. రంగారావు.. ఈరాసామి పిల్లలందరికీ సద్దిసెప్పేరు.

రెండుగుమ్మాల మద్దెన, చెంకీదండలేసి.. గోడకి తగిలించుంది సూర్రావు నిలువెత్తు ఫుటో.. ఆ ఫుటోలోంచి ఓ చిన్న చిరునవ్వునవ్వుకుని, శాంతపడింది సూర్రావు ఆత్మ.

18 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

రాజు గారూ! ఎంత బా రాశారండీ! నా కళ్ళెమ్మట నీళ్ళు తిరిగిపోతున్నాయి...ఎండింగు బాగిచ్చారు.....మీ ఫ్యానునని చెప్పుకోటానికి నేను తెగ గర్వపడిపోతున్నా....

అజ్ఞాత చెప్పారు...

మాటలు రావటం లేదు. గొప్ప రచయితలు ఎక్కడినుంచోరారు. మనలోంచే వస్తారని చాలా గాఢంగా అనిపిస్తుందినాకు. మీ కధని వంశీ కధలతో పోల్చను. ఇకనుంచీ ఇలాంటి కధ ఎక్కడయినా చదివితే అచ్చు మా శ్రీనివాస్ కధలా వుందని చెపుతాను . ఎండింగ్ బావుంది. తనదాకా వస్తేనే తెలిసేది

మనసు పలికే చెప్పారు...

శ్రీనివాస్ గారు, చాలా చాలా బాగుంది. నాకైతే ఒక్కసారిగా ఇది వంశీ కథే అనిపించింది. ఆయన కథలు ఈమధ్యనే చదువుతున్నానులే. చాలా నచ్చాయి. మీ కథ చదువుతూ అలా అలా ఎక్కడికో వెళ్లొచ్చాను. అద్భుతం:)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

కమ్మటి పల్లెవాసనలతో బ్రహ్మాండంగా ఉందండి కథ.

కృష్ణప్రియ చెప్పారు...

చాలా చక్కగా రాశారు..చివరి లైన్ దాకా తలెత్తకుండా చదివించారు..

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యగారు
మీ కామెంటుకు ధన్యవాదములు.
కధమీకు నచ్చినందుకు చాలా సంతోషంగావుందండీ. నేనెంతలా రాసినా అర్ధంచేసుకున్నవాళ్ళున్నారు, చదివి ఆనందించగలిగేవారున్నారు. అదే నాచేత మరో వేయి కధలను రాయించగలదు.

@లలిత గారు
మీ కామెంటు నాలో ఒక కొత్త హుషారు తెచ్చిందంటే నమ్మండి. "మా శ్రీనివాస్ కధలా వుందని చెపుతాను", ఇది చాలు ఈ బ్లాగులో నేను కధలు రాసినందుకు పారితోషికంగా. :-)

@మనసు పలికే గారు
మీకు నచ్చినందుకు సంతోషం. పెద్దవాళ్ళకధలతో నా కధలను పోల్చి నన్ను చాలా పెద్దవాడిని చేస్తున్నారు. నేనింకా ఎన్నో నేర్చుకోవాల్సినవాడిని. మీరు చదివి ఆనందించారు అంతే చాలు. :-)

@వేణూ శ్రీకాంత్ గారు
కమ్మటి వాసనలు ఆస్వాదించి మైమరిచిపోయినందుకు చాలా సంతోషం. మీ కామెంటుకు ధన్యవాదములు.

@కృష్ణప్రియ గారు
కధనచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. మీ కామెంటుకు ధన్యవాదములు.

మంచు చెప్పారు...

రాజు గారు నేను బిజి ఉన్న టైంకి ఈ టపాఎట్టి దెబ్బేకొట్టేసారు. మామూలుగానే మొదటి లైన్ నుండి చివరాఖరు లైన్ వరకు కళ్ళు పరిగెడుతూనే ఉన్నాయండి... ఈరొజు నుండి మీ బ్లాగుకి నేను ప్రచారకర్త నండీ ... ఈ సారి మనూరు వచ్చినప్పుడు మనం కల్వాల్సిందే.... ముక్క మందు తొ పార్టీ చేసుకొవాల్సిందే....

BTW జక్కంశెట్టి మనఊరులొ ఉన్నా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇంటిపేరు.

3g చెప్పారు...

టైటిల్ చూసి సరదా కథ అనుకున్నాగాని మంచి టాపిక్ తీసుకున్నారు. మరీ సినిమాల్లోలా ఓవర్ నైట్ సొల్యూషన్ ఇవ్వకుండా సరిపడా టైం స్పేన్ తీసుకున్నారు. ఇక కథనం మీస్టైల్లోనే బాగుంది.

నీహారిక చెప్పారు...

ఇది కొద్దిగా మా నాన్న, పెదనాన్నల స్టోరీ అండీ, మా తాత చనిపోయాక ఇంటి మధ్యలో గోడ కట్టారు, ఆ గోడ కట్టిన తరువాత అంతా నాశనమై పోయారు, పెద్దమ్మ,పెదనాన్న ఇద్దరూ చనిపోయారు. నాన్న కి కాలు విరిగింది, తమ్ముడు కి కూడా పరిస్థితి బాలేదు, ఈ తరం అయినా మారతారని చాలా ప్రయత్నిస్తున్నాను, పెదనాన్న కొడుకులను మార్చగలిగాను కానీ మా నాన్నని,నా తమ్ముడిని మార్చలేకపోతున్నాను. ఇంటి మధ్యలో ఆ గోడ తీయించడానికి నేను చేయని ప్రయత్నం లేదు, మా కధ, మీ కధలా ఎప్పుడు ఎండ్ అవుతుందో?

ఈ మధ్య మీరు మరీ గోదావరి యాసతో మాత్రమే రాస్తున్నారు, అప్పుడప్పుడు మామూలుగా వ్రాయండి... ఎంత గోదావరి వాళ్ళయితే మాత్రం మరీ అంత ప్రాంతాభిమానం ఉండకూడదండీ !!

mallikharjun varma చెప్పారు...

EErraju kada chala bavundi okka word kuda miss avakunda chadavalinpinchindi......
...............danyavadamulu.....

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు గారు.
అయ్యో మీరు బిజీ అని నాకు తెలియదండీ.. ఓ మాట చెబితే ఖాలీగావున్నప్పుడే చేద్దునుకదా.. :-)
మీ ప్రచారానికి చాలా సంతోషం.

తప్పకుండా కలుద్దాం.. ఇండియా ఇలా పూణేనుండి వెళ్ళినా చెప్పండి కలుద్దాం. ఒక్కముక్క కాదు.. నాలుగు ముక్కలు నాలుగు పెగ్గులతో పార్టీ. :-)

అవునండీ మనూరోళ్ళ ఇంటిపేరే అది.

@3 గారు
కధలోని సొల్యూషన్ నచ్చినందుకు సంతోషం.
మీ కామెంటుకు ధన్యవాదములు

@నీహారిక గారు
మీ కధకి కూడా మంచి ఎండింగ్ వస్తుందనే ఆశిద్దాం.

ఈ మధ్య అంటే నాలుగు నెలలక్రితం రాసానండీ గోదావరి కధ. మళ్ళీ ఇదే రాయటం. మధ్యలో ఎనిమిది టపాలు మామూలువే రాసి జనాలను బోరుకొట్టించాను.
అంటే మీరు నా బ్లాగు చాలా రోజులతరువాత చూస్తున్నారన్నమాట. :-)

@మల్లిఖార్జున వర్మ
కధనచ్చి ఒక్కపదంకూడా వదలకుండా చదివినందుకు సంతోషం. అలాగే చదువుతారని ఆశిస్తున్నాను.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

చాలా బాగుంది రాజుగారు ఎప్పటిలాగే.లలిత గారి కామెంటే నాదికూడా.
ఇకపోతే మంచు గారూ నన్ను మర్చిపోయి ఇక్కడ జట్టుకలిపేసారు నేనొప్ప నేనొల్లా అంతే.

Unknown చెప్పారు...

శ్రీనివాస రాజు గారు .. నాకైతే బలే నచ్చేసింది ..
పొలాలు .. పల్లెటురులు కళ్ళ ముందు కనిపించేసై అంతే ..
ఏంటో ఈ బిజీ బతుకుల్లో పడి అవి తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది :) ఎం చేద్దాం ..

శ్రీనివాసరాజు చెప్పారు...

@శ్రీనివాస పప్పు గారు
టపానచ్చినందుకు సంతోషం. మీకామెంటుకు ధన్యవాదములు. అదిగో మీరూ.. నేనూ అంటున్నారు.. మనమంతా జట్టుకలుపుకున్నాం అనుకోండి :-)

@కావ్య గారు
అవన్నీ నేనూ మిస్ అవుతున్నానండీ. అందుకే ఇలా కధల్లో అవి చూసుకుని ఆనందిస్తుంటాను. :-)

ఏం చేయబోతున్నారో చెప్పండి. మంచి అయిడియా వుంటే నాక్కూడా చెబితే.. ఈ బిజీ బిజీ పట్నం వదిలి పారిపోతాను. :-)

అజ్ఞాత చెప్పారు...

కథ పాతదే అయినా చక్కగా చదివించేలా వ్రాసారు. అభినందనలు.

ఈ సారి చాలా ఏళ్ళ తరువాత అంతర్వేది తీర్థానికి వెళదామనుకుంటున్నాను.
మీరేమైనా వస్తున్నారా?

అజ్ఞాత చెప్పారు...

మంచి కథ చెప్పారు రాజు గారు. ధన్యవాదములు.

శ్రీనివాసరాజు చెప్పారు...

@బోనగిరి గారు
చక్కగా చదివి కామెంటిచ్చినందుకు సంతోషం. :-)

లేదండీ వెళ్ళంటలేదు ఎప్పుడో కాలేజీ టైమ్లోవెళ్ళాం. తరువాత కుదరలేదు. క్షేమంగా వెళ్ళిరండి.
అన్నట్టు ఈ తీర్ధం గురించి కూడ ఒక కథ వుంది. త్వరలో రాబోతుంది :-)

@ఇద్దరు గారు
"ఇద్దరు" చదివి ఒక్క కామెంటివ్వటమేం బాలేదు. :-)
మీ కామెంటుకు ధన్యవాదములు.

swathi చెప్పారు...

వంశీ గారి పసలపూడి కథలు మొన్న ఆదివారం చదివాను.నాకు అయితే
అవి నచ్చలేదు.కొన్ని బాగానే ఉన్నాయి.గోదావరి యాసలో మీరు అద్భుతంగా రాస్తున్నారు.
అభినందనలు.

Related Posts Plugin for WordPress, Blogger...