30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కాంక్రీటు మనసులు...


ఇల్లు ఎంత ఇరుగ్గావుంటే మనసులంత దగ్గరగావుతాయి అంటారు.ఇది చాలా నిజం.. చిన్న ఇంటిలోవున్న ఆనందం పెద్ద మహల్ లో బిక్కుబిక్కుమంటూ గడిపితే వుండనేవుండదు. ఇరుకు ఇల్లే లేవు అంటే.. కలివిడిగా కలిసిమెలిసి ఉండే ఉమ్మడికుటుంబాలు అసలే లేవు కాబట్టి, నాలుగువేపులా కాంక్రీటుతో కట్టిపడేసిన జైలులాంటి గోడలమధ్య వుంటూ మాది అపార్మెంటు కల్చర్.. ఎదుటివాడి గోల మనకు అవసరం లేదు, అనుకుంటూ చక్కగా హాల్లో కూర్చుని కాళ్ళుచాపుకుని కాలం గడుపుతున్నాం. తల్లిదండ్రులను అత్తమామలను దూరంగా నెట్టి.. హనీమూన్ లైఫులాగా గడుపుతుంటారు కొత్తజంటలు. ఎప్పుడో చుట్టంచూపుగా వచ్చే అత్తగారు కోడలికి.. దైవంలాగా తోస్తుంది. కోడలు అత్తగారికి.. మహాలక్ష్మిలాగా అనిపిస్తుంది. వున్న నాలుగురోజులూ అడుగులకు మడుగులెత్తుతూ ఒకరికొకరు సేవలు చేసుకుంటారు. అదే దగ్గరగా వుంటే తినగా తినగా బెల్లంముక్క కూడా చేదైనట్టుగా.. ఒకరిమొహాలు ఒకరు చూసుకుని.. విరక్తికలిగి.. నువ్వెంత అంటే.. నీ బతుకెంతా!, అనుకును జుట్టూజుట్టూ పట్టుకునే వరకూ వస్తుంది విషయం. అందుకే అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వస్తేనే గౌరవమని ఆరోగ్యానికి మంచిదని అందరూ ఈ అపార్ట్మెంటు కల్చర్కి జేజేలు కొడుతున్నారు.

కోటలూ మేడలూ వదిలి.. కాంక్రీటు గదుల్లోకి చెరిన మన మనసులు కూడా కాంక్రీటు రాళ్ళలాగా మారిపోతున్నాయి. ఆప్యాయతలు.. అనురాగాలు మరిచిపోతున్నాం.. డబ్బు తప్ప కంటికేది కనపడక చూపు మసకబారుతుంది. ఆ మసకబారిన చూపుతో చూస్తే మన అన్నవాళ్ళెవరూ కనీసం మసకగా కూడా కనబడరు. పెళ్ళైన కొత్తలో అడ్డు అనుకున్న అత్తమామలూ.. తల్లిదండ్రులు.. పిల్లలుపుట్టాకా వస్తేబాగుండుననిపిస్తుంది. మనింట్లో ఓనాలుగు రోజులుంటే పిల్లాడికి కావలసిన చాకిరీ అంతా చేయించవచ్చు అన్నది ఈ కాంక్రీటు మనసుల ఆలోచన. పాపం మనవడినో మనవరాలినో చూద్దామని వచ్చినవారికి నడుంనెప్పులూ కీళ్ళనొప్పులూ తప్ప ఏమీ మిగలవు. కనీసం వారిని బయటకు కూడా తీసుకెళ్ళకుండా ఆ కాంక్రీటు మహల్లో కట్టిపడేసి చక్కగా మళ్ళీహనీమూన్ జంటలాగా ఊర్లు పట్టుకుని తిరుగుతుంటారు జంటలు. నెమ్మదిగా పిల్లలెదుగుతారు. ఇక నాన్నమ్మ- అమ్మమ్మలు.. తాతయ్యలు భరువవుతారు. పిల్లవాడిని గారాభం చేసి చెడగొట్టి చెడుబుద్దులు నేర్పే లిస్టులోకి వారూ చేరిపోతారు. ఇప్పటిదాకా పిల్లాడిని అంటిపెట్టుకునివుండి..వాడి ఉచ్చగుడ్డలు ఉతికిన ఆ ప్రాణులకి ఎన్నో ఆంక్షలు.. అపనిందలు. మొత్తం ప్రపంచం అంతా ఫలానా వారు.. తమ కొడుకు దగ్గరో అల్లుడు దగ్గరో వుంటున్నారు వాళ్ళకేంటి ఎంత రాజభోగమో.. వాళ్ళపనేహాయి అనుకుంటుంది. కానీ వారి బాధలు ఎవరికీ అర్దం కావు. ఎవరికీ చెప్పుకోలేరు కూడానూ. మరి గ్రాండ్ పా,గ్రాండ్ మా ని కూడా మనతో తీసుకెళదాం..అని నడకొచ్చి.. అప్పుడప్పుడే నడవడిక నేర్చుకుంటున్న ఆబుడతడి మాట కూడా పట్టించుకోకుండా వాళ్ళదారిన వారు మళ్ళీ ప్యామీలీ ట్రిప్పులేసుకుని.. హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తారు.. ముసలాళ్ళను మళ్ళీ మళ్ళీ  ఆ మహల్లో పడేసి..  ఇంటికో.. ఇంట్లో వున్న కుక్కకో.. లేక గాజుతొట్టెలో రంగుచేపకో.. పంజరాన రామచిలుకకో కాపలాగా వుండండని వదిలిపడేస్తారు.

సరే ఇక్కడివరకూ కధ మొత్తం మన టీవీ సీరియల్లో చూపించినట్టు మొదలుపెట్టిన నాలుగు వారాలు ప్రేమలే  కానీ పెద్దగాదోమలు కుట్టిన దద్దుర్లు లేకుండా గడిచిపోతుంది. అసలు విషయం ఎక్కడొస్తుందంటే ఆ ముసలాళ్ళు మనమీద ఆధారపడటం మొదలయ్యినప్పుడు.
నాకు తెలిసిన ఒకాయనది ప్రేమవివాహం. వాళ్ళతల్లిదండ్రులు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే కాలనీలో వుండేవారంట. అలా చిన్నప్పటి కుటుంబాల మధ్య పరిచయంతో అతనికి ఆ అమ్మాయితో ప్రేమగా మారింది.తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పెళ్ళి జరిపించారు. ఆ అమ్మాయి ఒకతే కూతురు. వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోతే వాళ్ళమ్మగారికి అదే కంపెనీలో టీచరు ఉద్యోగం వచ్చింది. అలాగే ఆవిడ రిటైరయ్యారు. ఈ జంటకి పిల్లలులేనంతవరకూ ఆవిడ విడిగానే వుంటూ వస్తున్న పెన్సన్ తీసుకుంటూ ఒంటరిగానే ఉన్నారు. ఈజంటకి పిల్లలు పుట్టాకా  ఆవిడని ప్రేమగా రప్పించారు. ఆ పిల్లాడి ఆలనా పాలనా చూస్తూ ఆవిడ వాళ్ళతో కలిసే వున్నారు.ఆవిడకి ఈమధ్య కిడ్నీలో ఏదో సమస్య మొదలైంది. దాంతో ఆపరేషను అదీఇదీ చాలా హడావిడయ్యింది. ఆపరేషనుకు ఆమెకున్న డిపాజిట్లు.. సేవింగ్సూ ఖాలీ అయిపోయాయి. ఈస్టోరీ ఇలా నడుస్తుంది.

ఒకరోజు ఎవరో ఏదో మంచి సందర్బంవస్తే స్వీట్లు పంచుతుండగా అతన్ని ఎవరో అడిగారు.. నువ్వెప్పుడు స్వీట్లిస్తావు, మీ అబ్బాయి పుట్టినరోజు రాబోతుంది అని. దానికన్నా ముందే ఇద్దామనివుంది.. మా అత్తగారు టపా కట్టాకా అన్నాడు. అప్పుడు సరదాగానే అనిపించిన ఆ మాట.. తరువాత మాకేదోలా అనిపించింది. పిల్లాడి పుట్టినరోజుకని వాళ్ళవూరికి బయలుదేరారు. అత్తగారికి ఆపరేషను అయ్యి రెండురోజులు కూడా కాలేదు. ఆమెను రైల్లో బలవంతంగా ఎక్కించారు. సగం దూరం ప్రయాణం చేసాకా ఆవిడకు నొప్పి అని రాత్రికి రాత్రే ఎక్కడోమారుమూల స్టేషన్లో దిగి వెనక్కు రావాల్సొచ్చింది. ట్రిప్పు క్యాన్సిల్ అయ్యింది. తరువాత దిగాలుగా మొహంపెట్టి.. కనిపించినతను..మొత్తం ప్లానంతా పాడుచేసింది మా అత్త అన్నాడు. అదేంటి మరీరెండు రోజులే కదా అయ్యింది ఆపరేషన్ అయ్యి. రెస్ట్ అవసరం కదా అలా ఎలా తీసుకెళ్ళావు.. అన్నాంమేమంతా. లేదుడాక్టర్ పర్వాలేదన్నాడు. ఆవిడని అడిగితే బాగుంది వెళదాం అంది..అందుకే వెళ్ళాం అని చిరాకు పడ్డాడు. అలా రెండుమూడు నెలలు గడిచాయి.. ఆవిడ కోలుకుంది.. వాళ్ళఅన్నయ్యవాళ్ళింటికి చూడాలనివుంటే పంపించారు..

మళ్ళీ కొన్నాళ్ళకు అతను దిగాలుగా కనిపించాడు ఏంటని వివరం అడిగితే.. చెప్పాడు.. మా అత్తగారు మొత్తం దుకాణం సర్దేసి మా దగ్గరకొచ్చేసింది. వాళ్ళ అన్నయ్యలున్నారు వారి దగ్గరకెళ్ళొచ్చు కదా..మేమే దొరికాం లోకువగా అన్నాడు. అదేంటయ్యా  ఆవిడకి ఒకతేకూతురు ఎక్కడకెళుతుంది. కూతురు చూడకపోతే వాళ్ళ అన్నయ్య ఎలా చూస్తాడు.. వారి ప్యామిలీ వేరు కదా అన్నాం.. ఏ ఎందుకు చూడరు.. అన్నాడు. ఎందుకొచ్చిన గొడవని మేం ఏమీ మాట్లాడలేదు.

పెళ్ళికిముందే అతనికి తెలుసు.. ఒకతే కూతురు కనుక ఆవిడకి వీళ్ళే సపోర్ట్ అని.. అలా అని అతనిది చాలీచాలని జీతం కాదు. ఆవిడని చూసే స్తోమత లేనివాడుకూడా కాదు. అయినా ఇంట్లోవున్న మనిషి ఏం తినేస్తుంది.. మామూలుకన్నా ఒక రెండు రోటిలెక్కువ అంతే కదా!, పోనీ వారికేమన్నా వీకెండు షాపింగులు చేసి అదీ ఇదీ కావాలనే ఓపికుంటుందా.. అదీలేదు కదా!, మరెందుకో అలా.. మాకైతే అర్ధంకాలేదు. తల్లిదండ్రుల తరువాత అంతటివారు ఎవరూ అంటే అత్తమామలే కదా. వాళ్ళకు మనం గౌరవమివ్వకపోతే.. మనల్ని పెళ్లిచేసుకుని అన్నీ వదిలి వచ్చిన ఆ అమ్మాయి.. రేపు మన తల్లిదండ్రులకు విలువనిస్తుందా?, ఇవన్నీ చూసిన మన పిల్లల మనకు విలువనిస్తారా? విలువనిస్తే ఎంత ఇవ్వకపోతే ఎంతంటారా!, ఏమో ఎవరి వాదనలు వారివి. ఏంటో జీవితం అసలు అర్ధంకాదు. మన బాధలే మనకు అర్ధంకానప్పుడు ఎదుటివాడివి అసలుఅర్దంకావులేండి.

ఇంటికీ, ఇంటిలోని ఫర్నీచరుకీ లక్షలు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడనివాళ్ళు. చిన్న చిన్న విషయాలదగ్గర కక్కుర్తి చూపింస్తుంటారు. మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగాడు.. ఎంతో సాధించాడు.. అని అనిపించినవెంటనే మనకు ఇలాంటివి వినగానే ఇంతలా ఎదిగిన మనిషి  బుర్రలోనుండి ఇంకా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.. అంటే నిజంగానే మనిషి అంతలా ఎదిగాడా..అంత సాధించాడా అనిపిస్తుంది.



11 కామెంట్‌లు:

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Good post.

కౌటిల్య చెప్పారు...

హ్మ్! రాజు గారూ! బాగా చెప్పారు... అందుకే మనవాళ్ళు ముందే చెప్పారు,"స్వమాతా,పత్నీమాతా,గురుపత్నీ,రాజపత్నీ, జ్యేష్ఠ బ్రాతృ కుటుంబినీ" అని ఐదుగుర్ తల్లులు ప్రతి వాడికీ... అది ఈ కాలపు ఇంగిలీసు చదువులు చదివిన వాళ్ళకి తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు..

Srikanth Eadara చెప్పారు...

నిజమే రాజు గారూ..... మనసులు ఇరుకైపొతున్నాయి ........

నేస్తం చెప్పారు...

చాలా బాగా చెప్పారు రాజుగారు..ఆడపిల్ల వాళ్ళ అమ్మానాన్నను చూసుకునే అధికారం ఎందుకు ఇవ్వరో.. అత్తమామలైనా అమ్మానాన్నలైనా ముసలితనంలో తోడు లేకపోతే ఎలాగా?పాపం ఏమైపోతారు ..

వాత్సల్య చెప్పారు...

అధ్భుతం.. ఫలానా వాక్యం అని కాదు మొత్తం టపా అంతా.

శ్రీనివాసరాజు చెప్పారు...

@వీరుభొట్ల గణేష్ గారు, రిషి గారు
నా బ్లాగులో ఈ టపా కాస్త డిఫెరెంటే. చాలా సీరియస్ టాపిక్కే.. కానీ నా మనసులోవున్నది చెప్పాలనిపించింది.

@కౌటిల్య గారు
ఎంత బాగా చెప్పారు. మా చిన్నప్పుడు సంస్కృత పాటాల్లో విన్న పద్యం. ఈ కాలపు ఇంగిలిపీసు ఎంగిలి చదువుల్లో ఇలాంటివి అసాధ్యమే.

@శ్రీకాంత్ గారు
ఇరుకు మనసులు కరుకుగా మారుతున్నాయి.

@నేస్తం గారు
అది ప్రతివారి మనసునుండి రావాలండీ. ఈ మధ్య వృధ్ద ఆశ్రమాలు పెరిగిపోటానికి కూడా అదే కారణం. పెద్దాళ్ళే పిల్లలదగ్గరుండటానికి ఇష్టపడటంలేదు. విడిగా వుండటానికే ప్రయత్నిస్తున్నారు. ముసలాళ్ళు మహావుంటే ఎంతకాలమండి మనతోవుండేది.

ఏదైనా ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. లేనినాడు ఎంత ఏడ్చినా తిరిగిరాదు.

Mauli చెప్పారు...

చిన్న కుటు౦బాల గురి౦చి చాల బాగా వ్రాసారు. వాళ్ళ అమ్మాయికి లేని ప్రేమ అల్లుడు కి లేదని మాత్రం ఎలా విమర్సి౦చగలము ?

మనసు పలికే చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

బాగా వ్రాసారు. ప్రతి ఇంటా ఒక "బాగ్ బన్" కథ ఉంటుందనుకుంటా.

కృష్ణప్రియ చెప్పారు...

ఇంచు మించు ప్రతి ఇంట్లోనూ ఇదే కథ..

శ్రీనివాసరాజు చెప్పారు...

@బోనగిరి గారు, కృష్ణప్రియ గారు
కథల్లో జరిగింది కళ్ళముందు కనపడగానే బాధనిపించింది.

Related Posts Plugin for WordPress, Blogger...